Breaking News

సప్తవర్ణ శోభితం శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

సప్తవర్ణ శోభితం శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుప‌తి, 2024 డిసెంబ‌రు 07: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది.

వేడుకగా స్నపన తిరుమంజనం :

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

పుష్ప‌యాగం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలు అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో 2 టన్నులు తమిళనాడు, ఒక టన్ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒక టన్ను
కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు అందించారు.

వైభవంగా పుష్పాల ఊరేగింపు :

ప్రజలను ఆదుకోవడంలో ముందు ఉండాలి.

మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.

సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, ప‌గ‌డ‌పు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ కార్యక్రమంలో జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీమతి గౌతమి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, గార్డెన్‌ డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *