పార్శిల్పై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించిన డ్రైవర్
డ్రగ్ పెడలర్ అరెస్ట్.. కిలో గంజాయి స్వాధీనం
దుండిగల్, జూన్ 3: రాపిడో డ్రైవర్ అప్రమత్తతతో గంజాయి సరఫరా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మే 31న మేడ్చల్ నుంచి గండి మైసమ్మకు ఒక వ్యక్తి రాపిడో పార్శిల్ బుక్ చేయగా, ఆ పార్శిల్ను తీసుకెళ్తున్న రాపిడో డ్రైవర్ సత్తు ఆదర్శ్కు అనుమానం కలిగింది. వెంటనే ఆయన దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు.
డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టి, ఒక డ్రగ్ కన్జ్యూమర్తో పాటు ఓ డ్రగ్ పెడలర్ను అదుపులోకి తీసుకున్నారు. పెడలర్ వద్ద నుంచి సుమారు ఒక కిలో గంజాయిని స్వాధీనం చేసుకుని, దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించిన రాపిడో డ్రైవర్ సత్తు ఆదర్శ్ను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి, ఐపీఎస్ అభినందించి, శాలువాతో సత్కరించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
