రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పూలమాలకూ నోచుకోని స్మారకం
దుండిగల్లో స్థూపాన్ని శుభ్రపరిచి నివాళులర్పించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
దుండిగల్, ప్రజా ఎన్ కౌంటర్ జూన్ 01:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే దుండిగల్ మండల కార్యాలయం, జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల ఆవరణలో ఉన్న అమరవీరుల స్థూపం అధికారుల నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మారక స్థూపానికి కనీసం పూలమాల కూడా వేయకపోవడం స్థానిక ఉద్యమకారులు, ప్రజల్లో ఆగ్రహానికి దారితీసింది.
రాష్ట్రవ్యాప్తంగా అమరవీరులను స్మరించుకుంటూ నివాళులర్పించిన వేళ, దుండిగల్లోని స్థూపం మాత్రం నిర్లక్ష్యంగా కనిపించింది. స్థూపం చుట్టూ పరిశుభ్రత కూడా లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని స్థూపాన్ని శుభ్రం చేయించి పూలమాలలు వేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, అలాంటి వీరులను స్మరించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే అమరవీరుల స్థూపాన్ని పట్టించుకోకపోవడం ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించబోమని హెచ్చరించారు. అమరవీరుల స్ఫూర్తిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పర్యటనతో స్థూపం వద్ద కొంతసేపు సందడి నెలకొంది. స్థానికులు కూడా అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
