…
రాబోయే 20 రోజుల్లో సర్వేను పూర్తి చేయాలి..
సర్వే కోసం గ్రామాలకు వెళ్లే ముందు రోజు ఊర్లో చాటింపు వేయించాలి..
గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి…
కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సిఎస్ శాంతి కుమారి..
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో
ఇల్లు లేని నిరుపేదలకు లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే ప్రాజెక్ట్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని, నాణ్యతగా సర్వే చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బుధవారం సీఎస్ శాంతి కుమారితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే ప్రాజెక్ట్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని, నాణ్యతగా సర్వే చేయాలని ఆదేశించారు. సర్వేయర్లు సర్వే చేయడానికి వెళ్లే ముందు రోజు గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. రాబోయే 20 రోజుల్లో సర్వేను పూర్తి చేయాలన్నారు. సర్వేలో క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ లను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఇందిరమ్మ కమిటీ లను కూడా సర్వేలో ఇన్వొల్వ్ చేయాలన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 6892 ఇళ్లను ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సర్వే చేయడం జరిగిందన్నారు. సర్వే చేయడానికి ముందే సిబ్బంది ఇళ్లకు పంపి డాకుమెంట్స్ సిద్ధం చేసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుందన్నారు. 35 గ్రామాల్లో 500 కన్నా ఇండ్లు ఎక్కువగా ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో అదనపు సిబ్బంది అవసరం అని, అందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
పక్కాగా గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ
గ్రూప్ 2 పరీక్షను పక్కాగా నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. వంద శాతం బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలన్నారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా పరీక్షకు అన్ని పక్కడబందీ ఏర్పాట్లు చేయాలని టీజీపీఎస్సీ ఛైర్మన్ చెప్పారు. ఎలక్ట్రానిక్ వాచ్ లు, మొబైల్స్, ఎట్టి పరిస్థితిలో అనుమతించకూడదని సూచించారు. నిర్దేశించిన సమయంలోనే అభ్యర్థుల్ని పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ విద్యాసంస్థలు, వసతి గృహల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం 40శాతం మెస్ చార్జీలు పెంచిన నేపథ్యంలో డిసెంబర్ 14 వ తేదీన విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. అందులో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. సమావేశం లో అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డిఎస్పీ ఉమా మహేశ్వర్, ఇతర జిల్లా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.